న్యూఢిల్లీ: దేశంలో గత వారం రోజులుగా ప్రతిరోజు 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రికవరీ అయ్యేవారి సంఖ్య కంటే కొత్తగా కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. దాంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. బుధవారం ఉదయానికి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,34,406గా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ సంఖ్య దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్యలో 2.05 శాతమని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
దేశంలో ఇటీవల నమోదవుతున్న కొత్త కేసులలో ఎక్కువగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్ రాష్ట్రాల నుంచే ఉన్నాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం యాక్టివ్ కేసులలో కూడా ఆ మూడు రాష్ట్రాల్లోనే 76.4 శాతం ఉన్నాయని పేర్కొన్నది. ఇక కేవలం ఒక్క మహారాష్ట్రలోనే 60 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. కాగా, గత 24 గంటల్లో దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు.