యాక్సిడెంట్ చేసి.. గాయాలకు గురైనవారిని దవాఖానకు తరలించకుండా తప్పించుకుంటున్నారా.. అయితే జాగ్రత్త… అలాంటివారిపై సైబరాబాద్ పోలీసులు చట్టంలోని కఠిన సెక్షన్ను అమలు చేస్తున్నారు.. ప్రమాదాలకు పాల్పడి తప్పించుకునేవారిపై 304 పార్టు కింద కేసు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు.. రాంచంద్రాపురం ప్రాంతంలోని ఓ స్టీల్ దుకాణంలో పనిచేసే రమేశ్కుమార్ ఈ నెల 8న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బైక్పై వేగంగా ప్రయాణిస్తూ రోడ్డు దాటుతున్న సత్తయ్య(75)ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన సత్తయ్యను అలాగే వదిలేసి రమేశ్కుమార్ పారిపోయాడు.. స్థానికులు అంబులెన్స్ ద్వారా బాధితుడిని ఉస్మానియా దవాఖానకు తరలించగా మృతి చెందాడు.. ఆర్సీ పోలీసుల దర్యాప్తులో సత్తయ్యను ఢీకొట్టిన రమేశ్కుమార్ నిర్లక్ష్యంగా బాధితుడిని సమయానికి దవాఖానకు తరలించకుండా, ప్రమాద విషయాన్ని పోలీసులకు చెప్పకుండా దాచి పెట్టిన విషయానికి సంబంధించిన ఆధారాలు సేకరించారు. నిందితుడు రమేశ్కుమార్పై 304 పార్టు 2 కింద కేసును నమోదు చేసి.. ఈ నెల 13న నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే..ప్రమాదానికి కారకుడైన వాహనదారుడు సమయానికి పాదచారుడిని దవాఖానలో చేర్చి ఉంటే అతడి ప్రాణాలు దక్కేవని, వాహనదారుడి నిర్లక్ష్యం కారణంగా సరైన సమయంలో వైద్య చికిత్స అందకపోవడంతో పాదచారుడు మృతి చెందాడని పోలీసులు తెలిపారు. రమేశ్కుమార్కు లైసెన్స్ లేదని తెలిసి కూడా వాహనం ఇచ్చిన బైక్ యజమాని రాముపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదం జరిగితే పారిపోకండి…మానవత్వంతో స్పందించండి… ప్రమాదం జరిగినప్పుడు ఎలాం టి గందరగోళానికి గురికాకుండా వెంటనే పోలీసులను అప్రమత్తం చేయడంతో పాటు అంబులెన్స్కు సమాచారం ఇవ్వండి… అంతేగానీ మానవత్వం మరిచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్ స్పష్టం చేశారు. 304 పార్టు-2 కింద నేరం రుజువైతే నిందితుడికి 10 ఏండ్ల జైలు శిక్ష తప్పదని, రమేశ్కుమార్కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని తెలిసి కూడా వాహనం ఇచ్చినందుకు యజమాని రాముపై కూడా చర్యలు ఉంటాయని డీసీపీ తెలిపారు.