సిటీబ్యూరో, మార్చి 13(నమస్తే తెలంగాణ): ఉప్పల్ భగాయత్ హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థకు వేయి కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చిన ప్రాంతం. వందలాది ఎకరాల్లో చేసిన లే అవుట్లకు నగరవాసుల నుంచి గణనీయమైన ఆదరణ రావడంతో హెచ్ఎండీఏ ఖజనా కళ కళలాడింది. ఇప్పటి వరకు రెండుసార్లు ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో హెచ్ఎండీఏ భారీ లేఅవుట్లు చేసింది. మొదట 413 ఎకరాల్లో, తర్వాత 72 ఎకరాల్లో చేసిన లే అవుట్లు హెచ్ఎండీఏ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన లే అవుట్లుగా నిలిచాయి. తాజాగా, ఉప్పల్ భగాయత్లోనే హెచ్ఎండీఏ ఖాతాలో ఉన్న మరో 40 ఎకరాల భూమిని సైతం లే అవుట్గా అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉప్పల్ భగాయత్ ప్రాంతంలోని ప్లాట్ల ధరలు మంచి డిమాండులో ఉండటంతో ఖాళీగా ఉన్న స్థలాన్ని హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం లే అవుట్ చేసి విక్రయిస్తే మంచి ఆదాయం వస్తుందనే ఆలోచనలో ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే లే అవుట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఇక్కడ సుమారు 95 ఎకరాల భూములు హెచ్ఎండీఏకు చెందినవే ఉన్నా, అందులో వివిధ కుల సంఘాల కోసం 55 ఎకరాలను కేటాయించగా, మిగిలిన 40 ఎకరాల భూమిలో లే అవుట్ను చేయాలని భావిస్తున్నారు.
కొత్త లే అవుట్ నుంచే వరంగల్ హైవేకు లింకు రోడ్డు
ప్రస్తుతం, ఉప్పల్ మీదుగా ఉన్న హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంది. నిత్యం ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. పైగా ఉప్పల్ చౌరస్తా నుంచి బోడుప్పల్, మేడిపల్లి మీదుగా నారాపల్లి వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జీతో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉప్పల్-నాగోల్ మధ్య ఉన్న ఇన్నర్ రింగు రోడ్డు నుంచి గతంలో చేసిన ఉప్పల్ భగాయత్ లే అవుట్లో మూసీనది పొడవునా 3 కి.మీ దూరానికి పైగా 100 అడుగులకు పైగా వెడల్పుతో రోడ్డును ఫీర్జాదిగూడ వరకు నిర్మించారు. అక్కడి నుంచి ఉప్పల్ చెరువు, ఫీర్జాదిగూడ జంక్షన్ వరకు లింకు రోడ్డును నిర్మించేలా ఇప్పటికే హెచ్ఎండీఏ ప్రణాళికను సిద్ధం చేసి ఉంచింది. సుమారు 1.1 కి.మీ దూరం ఉండే ఈ లింకు రోడ్డు నిర్మాణం చేయాలంటే హెచ్ఎండీఏ పరిధిలో ఖాళీగా ఉన్న 100 ఎకరాల స్థలంలోంచే నిర్మించాలి. దీంతో లింకు రోడ్డుతో పాటే లేఅవుట్ను అభివృద్ధి చేయడం వల్ల రెండు విధాలుగా ప్రయోజనం ఉంటుందని అధికారులు యోచిస్తున్నారు.
తూర్పు హైదరాబాద్కు డిమాండు
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తూర్పు హైదరాబాద్ ప్రాంతంలోని ఉప్పల్, పోచారం ప్రాంతాల్లో ఐటీ కారిడార్ల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తూ పలు ప్రోత్సాహకాలతో గ్రిడ్ పాలసీని అమల్లోకి తెచ్చింది. దీంతో ఉప్పల్ ప్రాంతంలో ఉన్న భూములను లే అవుట్గా అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది. 40 ఎకరాలను ప్రభుత్వం నిబంధనల ప్రకారం లే అవుట్ చేసి విక్రయించడం ద్వారా సుమారు రూ.500 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఉప్పల్ మెట్రోరైలు డిపో చుట్టు పక్కల ప్రాంతాల్లోని సుమారు 413 ఎకరాల్లో ఏర్పాటు చేసిన లే అవుట్లో గజం ధర రూ.50 వేల నుంచి 60 వేల వరకు పలుకుతోంది. ఈ లెక్కన మిగిలిన 40 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ అభివృద్ధి చేసి ప్లాట్లను విక్రయిస్తే సుమారు రూ.500 కోట్లకు పైగానే వస్తుందని అంచనా వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐటీ రంగం ఇప్పటి వరకు ఒకవైపే అభివృద్ధి చెందుతూ వస్తోంది. పడమర దిక్కునే విస్తరిస్తున్న ఐటీ రంగాన్ని అన్ని దిక్కులా విస్తరించేలా ఇటీవల ప్రభుత్వం హైదరాబాద్ గ్రిడ్ పాలసీని తీసుకువచ్చింది. ఇందులో తూర్పు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న పారిశ్రామిక వాడలను ఐటీ కారిడార్లుగా మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో తూర్పు హైదరాబాద్ ప్రాంతంలోని ఉప్పల్లో ఉన్న 40 ఎకరాలను అభివృద్ధి చేస్తే అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుందన్న ఆలోచనలో హెచ్ఎండీఏ ఉంది. ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఉప్పల్ భగాయత్లో మరో హెచ్ఎండీఏ లే అవుట్ రూపుదిద్దుకోనుంది.