కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర మాజీ మంత్రి, ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేలో చేరిన కీలక నేత సువేందు అధికారి నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ దాఖలు చేశారు. సువేందు తన అనుచరులు కార్యకర్తలతో వెళ్లి అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇదిలావుంటే అధికార పార్టీ తరఫున స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జే ఈ స్థానం నుంచి రంగంలోకి దిగుతున్నారు. ఈ మేరకు గత బుధవారమే ఆమె నామినేషన్ దాఖలు చేశారు. దాంతో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ పోరు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.
కాగా, నామినేషన్ ముందు సువేందు అధికారి నందిగ్రామ్లోని ఓ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత హోమం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు పూర్తిగా మూసుకుపోయాయన్నారు. పరిస్థితిలో మార్పు రావాలంటే అధికార టీఎంసీని గద్దె దించాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటు కంపెనీగా మారిపోయిందని, ఆ పార్టీలో దీదీ, మేనల్లుడు మాత్రమే స్వేచ్ఛగా మాట్లాడగలరని విమర్శించారు. నందిగ్రామ్లో విజయం తనదేనని ధీమా వ్యక్తంచేశారు.