హైదరాబాద్ : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవిని భారీగా మెజారిటీతో గెలిపించాలని మంత్రి హరీశ్ రావు అభ్యర్థించారు. మంగళవారం చంపాపేట్లోని ఓ ఫంక్షన్ హాల్లో వాణి దేవికి మద్దతుగా ఏవీఎన్ విద్యాసంస్థల ఉద్యోగులు సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రి హరీశ్రావుతోపాటు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. వాణీదేవికి మద్దతు పలికిన ఏవీఎన్ విద్యా సంస్థల అధినేత ఏవీఎన్ రెడ్డిని అభినందించారు. ‘వాణీదేవి తండ్రి పీవీ నరసింహారావు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. వాణీదేవీ విద్యావేత్త.. మంచి సంస్కరణలకు నాంది పలికే వాణీదేవిని చట్టసభలకు పంపాలి. కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నది’ అని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత ఆలోచించి ఓటు వేయాలని కోరారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేని ఆయన పేర్కొన్నారు.