కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన ఎన్నికల మేనిఫెస్టోను మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 11న వెల్లడించనుంది. బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోజు ఉదయం నందిగ్రాంలో శివరాత్రి పూజ నిర్వహించిన అనంతరం కోల్కతా చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ నందిగ్రాం నుంచి పోటీ చేస్తున్నారు.
నందిగ్రాంలో దీదీపై బీజేపీ తరపున సువేంధు అధికారి తలపడనున్నారు. ఇక మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకూ ఎనిమిది దశల్లో బెంగాల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. బెంగాల్లో మరోసారి అధికార పీఠం దక్కించుకోవాలని మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ఉవ్విళ్లూరుతుండగా దీదీకి షాక్ ఇస్తూ పాలనా పగ్గాలు చేపట్టాలని కాషాయ పార్టీ ప్రచారాన్ని హోరెత్తించింది.