ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద గత నెలలో బాంబులలో కూడిన వాహనం కలకలం రేపిన కేసు, మన్సుఖ్ హిరెన్ మృతి కేసు దర్యాప్తును ఎన్ఐఏకు కేంద్ర హోంశాఖ బదిలీ చేయడం వెనుక ఏదో కుట్ర ఉన్నదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ వ్యవస్థలు అలాగే ఉంటాయని, వాటిపై నమ్మకం ఉంచాలని ఆయన సూచించారు. ఈ కేసును మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ (ఏటీస్) దర్యాప్తు చేస్తున్న సంగతిని గుర్తు చేశారు. వ్యవస్థలు ఎవరో ఒకరి ఆస్తి కాదని విమర్శించారు. ప్రభుత్వాలు మారినా వ్యవస్థలు మారవని, వ్యవస్థలపై నమ్మకం కలిగి ఉండాలని అన్నారు.
ఈ కేసు దర్యాప్తును కేంద్రం తీసుకుంటుందని, ఇందులో ఏదో ఉన్నదని అర్ధమవుతున్నదని ఉద్ధవ్ తెలిపారు. ఈ కేసును ఏటీఎస్ దర్యాప్తు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏటీఎస్పై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. మన్సుఖ్ మరణానికి కారణం ఏమిటన్నది బహిర్గతం చేసే వరకు ఈ కేసును వదిలిపెట్టబోమని అన్నారు.
సిల్వాస్సా ఎంపీ మోహన్ డెల్కర్ ఆత్మహత్యపై కూడా తాము దర్యాప్తు చేస్తున్నామని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. సిల్వాస్సా కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్నందున ప్రతి పక్షాలు దాని గురించి మాట్లాడటంలేదని విమర్శించారు. ఇక్కడ ఎలాంటి వ్యవస్థ లేదని, ప్రతిదీ కేంద్రంపై ఆధారపడి ఉందని చెప్పడం ద్వారా మహారాష్ట్రను పరువు తీసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.