21 రోజుల్లో పర్మిషన్ ఇచ్చేలా కలెక్టర్ చైర్మన్ గా కమిటీ
అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూసే పద్ధతికి స్వస్తి
అనుమతి లేని వెంచర్లపై ఉక్కుపాదం
ఖమ్మం, జూలై 16 (నమసే తెలంగాణ ప్రతినిధి): స్థిరాస్తి వ్యాపారంలో భాగంగా వెంచర్లు వేసేవారికి రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వెంచర్ల అనుమతులను సులభతరం చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఒకేవేళ అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తే సీరియస్గా పరిగణించనున్నది. అంతేకాదు, వెంచర్లు వేసేవారికి అన్నిరకాల అనుమతులు ఇచ్చే ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త వెంచర్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ కమిటీ పరిశీలించి 21 రోజుల్లో అనుమతులను మంజూరు చేయనున్నది.
రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసే వారికి ఇచ్చే అనుమతులను సులభతరం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ముందస్తు అనుమతులు లేకుండా వెంచర్లు చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని నిర్ణయించింది. జిల్లాలో పెరుగుతున్న ప్రజల అవసరాల దృష్ట్యా కొత్త వెంచర్లను ప్రోత్సహిస్తూనే వారిని నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించేలా కట్టడి చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఖమ్మం జిల్లాలో రియల్ ఎస్టేట్ వెంచర్లు పెద్ద ఎత్తున ఏర్పాటు కావడం, వాటిలో అనధికార వెంచర్లకు ముందస్తు అనుమతులు లేకపోవడం వంటి వాటిని గమనించిన ప్రభుత్వం.. వెంచర్ల ఏర్పాటుకు సంబంధించి మార్గదర్శకాలను జారీచేసింది. వెంచర్లు ఏర్పాటు చేసే వారికి అన్నిరకాల అనుమతులు ఇచ్చే ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. నియమ నిబంధనలకు అనుగుణంగా కొత్త వెంచర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి దరఖాస్తు చేసుకున్న వారికి 21 రోజుల్లో అనుమతులు ఇవ్వడానికి ఈ కమిటీ ద్వారా అవకాశం ఏర్పడనుంది.
వెంచర్ చేస్తున్న ప్రాంతం, దానికి సంబంధించిన భూమి పత్రాలు, నిబంధనలకు అనుగుణంగా అంతర్గత రహదారుల నిర్మాణం, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. భూమికి సంబంధించిన కన్వర్షన్, పట్టాదారు పాసుపుస్తకం వంటి వాటితో సమర్పించిన దరఖాస్తును జిల్లా స్థాయిలో ఏర్పడిన కమిటీ పరిశీలించి 21 రోజుల్లో అనుమతులను మంజూరు చేయనుంది. అలాగే ప్రభుత్వ అనుమతులు లేకుండా వెంచర్లకు సంబంధించి పబ్లిసిటీ బోర్డులను ఏర్పాటు చేయడం, అనుమతులు రాకుండానే ప్లాట్లను విక్రయించడం వంటి చర్యలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. గతంలో వెంచర్ ఏర్పాటు చేసుకోవాలనుకున్న రియల్ ఎస్టేట్దారులు ఇందుకు సంబంధించిన అనుమతులు పొందేందుకు నెలలతరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఈ రకమైన ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా టీఎస్ బీపాస్కు వెంచర్లకు సంబంధించిన అన్ని పత్రాలతో దరఖాస్తు చేస్తే వాటిని కలెక్టర్ అధ్యక్షతన ఉన్న కమిటీ పరిశీలించి వెంచర్ వేసే భూమిని సందర్శించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్వోసీ జారీచేస్తుంది. ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తుండగా అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్అండ్బీ అధికారులు సభ్యులుగా ఉంటారు. చెరువులకు 50 మీటర్ల దూరంలో వెంచర్లు వేసిన వాటికి మాత్రమే అనుమతులు ఇవ్వాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. గతంలో వెంచర్లకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారు వీటి అనుమతుల కోసం రాష్ట్ర రాజధానిలోని కార్యాలయానికి వెళ్లి వాటిని పరిశీలన అనంతరం అనుమతులు మంజూరు చేసేవారు. జిల్లా స్థాయిలోనే వెంచర్లకు అనుమతులిచ్చేలా ప్రభుత్వం నిర్ణయించడంతో కొత్తగా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేసేందుకు అనేకమంది ఆసక్తి కనబరుస్తున్నారు.
గ్రామ పంచాయతీలకు ఆదాయం..
గ్రామపంచాయతీలకు సైతం ఆదాయం పెరుగనుంది. ప్రతి రియల్ ఎస్టేట్ వెంచర్కు రూ.10 వేల ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంది. తద్వారా వెంచర్ల ఏర్పాటు ద్వారా ఆయా గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరుతుంది. అలాగే ప్రభుత్వం ఖమ్మం కేంద్రంగా ఏర్పాటు చేసిన స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) పరిధిలో వెంచర్లు వేసే వారి దరఖాస్తులను కలెక్టర్ అధ్యక్షతన గల కమిటీ ఇచ్చిన ఎన్వోసీలను పరిశీలించి అనుమతులను జారీ చేయనున్నారు. సంవత్సరకాలంగా సుడా దాదాపు 35 వెంచర్లకు అనుమతులు ఇవ్వగా దాదాపు రూ.6 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. ఈ నిధులతో ఖమ్మంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను చేపట్టారు. వెంచర్లకు అనుమతులను ప్రభుత్వం సులభతరం చేయడంతోపాటు త్వరితగతిన అనుమతులు మంజూరు చేసే అవకాశం ఉంది. దీంతో ఖమ్మం నగరం మరింత విస్తరించే అవకాశం ఉంది.
పారదర్శకంగా అనుమతుల మంజూరు..
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనుమతులు మరింత సులభతరం కానున్నాయి. కలెక్టర్ అధ్యక్షతన గల కమిటీ ఎన్వోసీ జారీ చేయగానే ఆయా వెంచర్లు సుడా పరిధిలో ఉంటే పరిశీలించి తక్షణమే అనుమతులు మంజూరు చేస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒకేచోట నిర్ణీత సమయంలో అనుమతులు లభించే అవకాశం ఏర్పడింది. నిబంధనలు పాటించకుండా, అనుమతులు లేకుండా వెంచర్లు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు.
-బచ్చు విజయ్కుమార్, సుడా చైర్మన్, ఖమ్మం