ఆ విధానంపై అన్నదాతలను చైతన్యపర్చాలి
అలా చేస్తేనే గులాబీ రంగు పురుగు నివారణ సాధ్యం
ఏఈవోల శిక్షణ కార్యక్రమంలో వాద్వాని గ్రూపు
కొణిజర్ల, జూలై 14: పత్తి పంటను ఆశించే గులాబీ రంగు పురుగు నివారణ కోసం లింగాలకర్షక బుట్టలు వినియోగించే విధానంపై రైతులను క్షేత్రస్థాయిలో చైతన్యపర్చాల్సిన బాధ్యత ఏఈవోలపై ఉందని డీఏవో విజయనిర్మల సూచించారు. లింగాకర్షక బుట్టల వినియోగం గురించి హైదరాబాద్ వాద్వాని గ్రూపు సభ్యులు శ్రీనివాస్, శాలిని బుధవారం కొణిజర్ల మండలంలో క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించారు. కొణిజర్లలోని గూదె గోవర్ధన్రావు అనే రైతు పత్తి పంటలో క్షేత్ర ప్రదర్శన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ ఏఈవోలు రైతులను ఎంపిక చేసుకొని పత్తి 45 రోజుల పంట దశలో ఉన్నప్పుడు లింగాకర్షక బుట్టలు పత్తి కంటే ఒక అడుగు ఎత్తులో ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం గ్రూపు సభ్యులు అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆరు జిల్లాలను ఎంపిక చేసి ఏఈవోలకు శిక్షణ ఇస్తోందన్నారు. వాద్వాని గ్రూపు, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ ప్రక్రియను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఏడీఏలు బాబురావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్రెడ్డి, సరిత, వైరా కేవీకే శాస్త్రవేత్త హేమంత్కుమార్, రవి, ఏవో బాలాజీ, ఏఈవోలు పాల్గొన్నారు.