బోనకల్లు, జూలై 14 : ఈ నెల 24న రాష్ట్రంలో ఐటీ, పురపాలకశాఖ మంత్రి పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. బుధవారం టీఆర్ఎస్ మండల కార్యాలయంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు అధ్యక్షతన ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ కంకనం కట్టుకోవాలన్నారు. దీనికి అనుగుణంగా మధిర నియోజకవర్గంలో విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు. రోడ్ల వెంట, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటి హరితహార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని హరితవనంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న హరితహారాన్ని విజయవంతం చేయడంతో పాటు, ఇలాంటి కార్యక్రమాలను విరివిగా చేపట్టాలన్నారు. పార్టీ అభివృద్ధి కోసం ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు, ప్రజాప్రతినిధులకు వివరించారు. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే విధంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి చేబ్రోలు మల్లికార్జునరావు, మాజీజడ్పీటీసీ బాణోతు కొండ, సర్పంచ్లు కొమ్మినేని ఉపేందర్, చిలకా వెంకటేశ్వర్లు, జెర్రిపోతుల రవీందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొనకంచి నాగరాజు, మండల ఉపాధ్యక్షుడు ఇటికాల శ్రీనివాసరావు, కాకాని శ్రీనివాసరావు, ఎంపీటీసీలు, గ్రామ అధ్యక్షులు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.