జేకే ఓసీలో రోజూ 8 వేల టన్నులు బొగ్గు ఉత్పత్తి
వివిధ కంపెనీలకు ప్రతి రోజు రెండు రేకులు సరఫరా
బొగ్గు రవాణాలో ఆదర్శం ఆర్సీహెచ్పీ
ఇల్లెందు, జూలై 13 :ఇల్లెందు ఏరియా బొగ్గు ఉత్పత్తి పడిపోతున్న తరుణంలో జేకే5 గుండెకాయల ఆదుకుంటున్నది. రోజూ 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తూ ఏరియా టార్గెట్ను కాపాడుతున్నది. తక్కువ మంది ప్రోడక్ట్యూ గ్రూప్ కార్మికులతో ఎక్కువ బొగ్గు ఉత్పత్తిని చేస్తూ సంస్థకే వన్నె తెస్తున్నది. ఇటీవల ప్రభుత్వం తెచ్చిన జీవోతో జేకే5 ఓసీ బొగ్గును కొనుగోలు చేసేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి.
ఇల్లెందు ఏరియాలో ఒక అండర్ గ్రౌండ్ మైన్, రెండు ఓపెన్కాస్టులున్నాయి. రెండు, మూడు నెలల నుంచి కోయగూడెం ఓపెన్కాస్టు ఉత్పత్తి భారీగా తగ్గింది. ప్రోడక్ట్ లేక రోజువారి టార్గెట్తోపాటు నెలవారి టార్గెట్నూ అధిగమించలేకపోతున్నది. ఉన్న ఒక అండర్గ్రౌండ్ మైన్ పరిస్థితి అంతంత మాత్రమే. కోయగూడెం ఓసీ ఉన్నా.. జేకే ఓసీనే ఏరియా భారం మోస్తున్నది. సీఎస్పీ దగ్గరుండడం.. ఖమ్మం, మహబూబాబాద్ రహదారులకు దగ్గర కావడంతో ఇక్కడి నుంచే రవాణా ఎక్కువగా కొనసాగుతున్నది. రోజుకు 8వేల టన్నులను ఉత్పత్తి చేస్తున్నది. జేకే5 ఓసీలో మొత్తం 350 మంది కార్మికులున్నారు. బొగ్గు ఉత్పత్తి చేసే కార్మికులు (ప్రొడక్ట్యూ గ్రూపు) 150 మంది మాత్రమే. 150 మంది కార్మికులతో 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతున్నది. ఫస్ట్ షిఫ్ట్ 50 మంది కార్మికులతో 2,500 టన్నుల బొగ్గు ఉత్పత్తవుతున్నది. రెండో షిప్ట్ 50 మంది కార్మికులతో 2,700 టన్నులు బొగ్గు ఉత్పత్తి అవుతున్నది. మూడో షిఫ్ట్ 50 మంది కార్మికులతో 2,800 టన్నులు బొగ్గు ఉత్పత్తి అవుతున్నది. మొత్తం కలిపి 150 మంది కార్మికులతో 8వేల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. రోజువారి టార్గెట్ 8,300ల టన్నులకు గాను 94 శాతంతో 8 వేల టన్నులను ఉత్పత్తి చేస్తున్నారు. వార్షిక సంవత్సరం 93 శాతం ఉత్పత్తితో జేకే5 ఓసీ ముందుకు సాగుతున్నది.
జేకే 5 బొగ్గు కోసం ముందుకొస్తున్న కంపెనీలు
జేకే5 బొగ్గు కోసం కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇటీవల కేంద్రం ఒక జీవో జారీ చేసింది. 34శాతం యాష్ ఎక్కువగా ఉన్న బొగ్గును 500ల కిలో మీటర్ల దూరంలో ఉన్న కంపెనీలు కొనుగోలు చేయాలని జీవో ఇచ్చింది. తద్వారా దగ్గర్లో ఉన్న కంపెనీలు కొనుగోలుకు ఆసక్తిని చూపిస్తున్నాయి. కేటీపీఎస్, వీటీపీఎస్, రామగుండం వంటి కంపెనీలు బొగ్గును కొనుగోలు చేసేందుకు వస్తున్నాయి. మొన్నటి వరకు ఒక రేకును మాత్రమే బొగ్గు సరఫరా చేసేది. ఇప్పుడు కేటీపీఎస్ కొనుగోలు చేయడంతో రెండు రేకుల బొగ్గును సరఫరా చేస్తుంది. జీ 16 గ్రేడ్ ఉత్పత్తి అయినప్పటికీ ఓవర్ బర్డన్ తీసిన తరువాత 4 నుంచి 5 మీటర్లు లేయర్ బొగ్గును తొలగిస్తున్నారు. 14 నుంచి 15 మీటర్లలో ఉండే బాటన్, మిడిల్ బొగ్గును మాత్రమే వెలికి తీస్తున్నారు. ఈ బొగ్గును కొనేందుకు పరిశ్రమలు ఆసక్తిని చూపిస్తున్నాయి. గ్రేడ్తో సంబంధం లేకుండా కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నాయి.
సమష్టి కృషితోనే రికార్డు సృష్టిస్తున్నాం.
రికార్డులను నెలకొల్పడంలో అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికులకు, టెక్నిషియన్ సిబ్బందికి, సహచర ఉద్యోగులకు, యూనియన్ నాయకులకు ప్రత్యేక అభినందనలు. ఏరియా జీఎం సీహెచ్ నర్సింహరావు ప్రోత్సా హం ఎన్నటికి మరువలేనిది. ఇదే స్ఫూర్తితో బొగ్గు రవాణా చేసి సింగరేణిలో చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించేందుకు కృషి చేస్తాం.
-ఉయ్యూరు వెంకటేశ్వర్లు, డీవైజీఎం ఆర్సీహెచ్పీ
రవాణాలో ముందుంటాం..
రక్షణతో పనిచేయడమే కాకుండా రావాల్సిన హక్కులను సాధించడంలో టీబీజీకేఎస్ ఎప్పుడూ ముందుంటుంది. ఆ దిశగా కృషి చేయడంతో కార్మికుల పోటీ తత్వంతో అరుదైన రికార్డును సాధించాం. కార్మికులు, అధికారుల కృషి ఫలితమే ఈ రికార్డు. భవిష్యత్లో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి మరో రికార్డు సృష్టిస్తాం.
–ఎండీ.గౌస్, ఆర్సీహచ్పీ పిట్ సెక్రటరీ
రెండు రేకులు సరఫరా చేస్తున్నాం
జేకే5 బొగ్గును రెండు రేకులు సరఫరా చేస్తున్నాం. 34 శాతం యాష్ ఎక్కువగా ఉన్న బొగ్గును 500ల కిలో మీటర్ల పరిధిలోనే కంపెనీలకు సరఫరా చేయాలని కేంద్రం జీవో ఇచ్చింది. 34శాతం యాష్ ఎక్కువగా ఉండే బొగ్గులో కార్బన్ శాతం తగ్గి బూడిద ఎక్కువగా ఉంటుంది. బూడిద ఎక్కువగా ఉన్న బొగ్గును 500ల కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరం సరఫరా చేయడం వృథా అని కేంద్రం భావించింది. బూడిద తక్కువగా ఉన్న బొగ్గులో కార్బన్శాతం ఎక్కువగా ఉంటుంది. కార్బన్ శాతం ఎక్కువగా ఉంటే బొగ్గు బాగా మండుతుంది. జేకే5 బొగ్గును రెండు రేకులు కేటీపీఎస్, వీటీపీఎస్లకు సరఫరా చేస్తున్నాం.