డంపింగ్ యార్డులను నిత్యం పర్యవేక్షించాలి
అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లి, జూలై 12: పల్లెప్రకృతివనాలు, డంపింగ్యార్డులు, నర్సరీలపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి పూర్తిస్థాయిలో వాటిని అభివృద్ధి చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో సోమవారం అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతిలో భాగంగా వీటిని అభివృద్ధి చేసేందుకు కృషిచేయాలని, జూలై 1 నుంచి 10 వరకు జరిగిన నాలుగో విడత పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు మండలస్థాయి, గ్రామస్థాయి అధికారులను అభినందించారు. పల్లెప్రగతి ముగిసినప్పటికీ గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామాల్లో నర్సరీల్లో వివిధ రకాల మొక్కలు పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు గ్రామస్థాయిలో నిమగ్నమై మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేయాలని సూచించారు. సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు మండలాల్లో ఆదివారం మంత్రులు ఎర్రబెల్లి, పువ్వాడ పర్యటనను విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రభుత్వ ఆస్తులను రక్షించుకోవాలి
వ్యవసాయ సీజన్ ప్రారంభమైన దృష్ట్యా రైతులు ప్రభుత్వ ఆస్తులను తమ ఆస్తులుగా భావించి వాటిని కాపాడుకోవాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. ఇందులో భాగంగా ఫుల్వీల్స్ ట్రాక్టర్లను రోడ్లపై తిప్పకుండా సహకరించాలన్నారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో ఏడో విడత హరితహారం కార్యక్రమంలో 3.67 శాతం అటవీ ప్రాంతం వృద్ధి చెందిందన్నారు. ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. మున్సిపల్ కమిషనర్ సుజాత, ఏసీపీ వెంకటేశ్, ఎంపీడీవోలు సుభాషిణి, రంజిత్కుమార్, వీరేశం, శ్రీనివాసరావు, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.