ఖమ్మం, జూలై 11: మ్యాక్స్విజన్ కంటి ఆసుపత్రుల గ్రూపులో భాగమైన శరత్ మ్యాక్స్విజన్ ఐ హాస్పిటల్స్ తన సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రిని ఖమ్మంలో ఆదివారం ప్రారంభించింది. నగరంలోని వైరారోడ్డులో గల ఈ ఆసుపత్రిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, మ్యాక్స్విజన్ ఐ హాస్పిటల్స్ సహ చైర్మన్, వ్యవస్థాపకుడు డాక్టర్ కాసు ప్రసాద్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హాస్సిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శరత్బాబు చిలుకూరి, సీఈవో వీఎస్ సుధీర్, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ బీ.కరుణాకర్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫౌండర్ కాసు ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ రోగులకు ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో చికిత్స అందించడంలో మ్యాక్స్విజన్ కృషిని వివరించారు. కంటి చికిత్సలో అగ్రగామిగా ఉన్న మ్యాక్స్విజన్ వైద్యులు అత్యంత అనుభవజ్ఞులని అన్నారు. దేశంలో 6 నగరాల్లో 16 సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రులతో మ్యాక్స్విజన్ సేవలందిస్తోందన్నారు.