అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఎన్నికల్లో అధికార వైసీపీ హవా స్పష్టంగా కనిపించింది. నగరపాలక సంస్థలో మొత్తం 50 డివిజన్లు ఉండగా.. 3 ఏకగ్రీవమయ్యాయి. 47 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా 25 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు తిరుగులేని విజయం సాధించారు. 28 సీట్లతో ఇప్పటికే మేయర్ పీఠం వైసీపీ వశమైంది. కేవలం 3 డివిజన్లలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఇదిలా ఉండగా 50వ డివిజన్ నుంచి వైసీపీ అభ్యర్థి, మాజీ మేయర్ నూర్జహాన్ బేగం విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 570 ఓట్లు ఆధిక్యంతో ఆమె గెలుపొంది రెండోసారి మేయర్ అభ్యర్థి రేసులో నిలిచారు. ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు వైసీపీ అభ్యర్థులు ఇవాళ జరిగిన కౌంటింగ్లో విజయం సాధించగా.. అనారోగ్యంతో కొన్నిరోజుల క్రితమే వీరు మరణించారు. దీంతో ఈ రెండు డివిజన్లలో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. వైసీపీ విజయంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి