గంగాధర మండలంలో పెరిగిన దిగుబడి
దిగుబడికి అనుగుణంగా కేంద్రాల ఏర్పాటు
గంగాధర, మే 23: మండలంలో ధాన్యం కొనుగోళ్లు శరవేగంగా సాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలతో వ్యవసాయాభివృద్ధి జరిగింది. రైతుబంధు, 24 గంటల విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో గ్రామాల్లోని చెరువులు, కుంటలను నింపడంతో వ్యవసాయం పండుగలా మారింది. ఏళ్లకు ఏళ్లు బీళ్లుగా ఉన్న భూములు కూడా సాగుకు నోచుకున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఏడాదికేడాది ధాన్యం దిగుబడి పెరుగుతుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వెంటవెంటనే మిల్లులకు తరలింపు
మండలంలో 33 గ్రామాలు ఉండగా ఐకేపీ ఆధ్వర్యంలో 11, గంగాధర సింగిల్ విండో ఆధ్వర్యంలో 12, కురిక్యాల సింగిల్విండో పరిధిలో 9, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 23వ తేదీ వరకు ఐకేపీ ఆధ్వర్యంలో 1012 మంది రైతుల నుంచి 78 వేల 5 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. 76,633 క్వింటాళ్లు మిల్లులకు తరలించగా, మరో 35 వేల క్వింటాళ్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కురిక్యాల పీఏసీఎస్ ఆధ్వర్యంలో 820 మంది రైతుల నుంచి 63,500 క్వింటాళ్లు కొనుగోలు చేయగా 63,200 క్వింటాళ్లు మిల్లులకు తరలించారు. ఇంకా 10 వేల క్వింటాళ్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. గంగాధర పీఏసీఎస్ ఆధ్వర్యంలో 951 మంది రైతుల నుంచి 89,227 క్వింటాళ్లు కొనుగోలు చేయగా, 83,562 క్వింటాళ్లు మిల్లులకు తరలించారు. మరో 40 వేల క్వింటాళ్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. గంగాధర మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 269 మంది రైతుల నుంచి 22,117 క్వింటాళ్లు కొనుగోలు చేయగా, 22,117 క్వింటాళ్లు మిల్లులకు తరలించారు. మరో 7 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. కేంద్రాల్లో రైతులకు తాగునీరు, శానిటైజర్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచారు. ధాన్యం విక్రయించిన రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి రెండు, మూడు రోజుల్లో బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు.