కొచ్చి, జూన్ 17: కేరళ తీరంలో సముద్రంలో ఓ దీవి ఇలా కనిపించి అలా మాయమైంది. పశ్చిమ కొచ్చి పట్టణంలో సగం అంత సైజు న్న దీవి గూగుల్ మ్యాప్స్లో కనిపించింది. అయితే ఆ లొకేషన్కు వెళ్లి చూడగా అక్కడ ఎలాంటి దీవి లేదు. కిడ్నీ ఆకారంలో ఉన్న ఈ దీవిని గురించి చెల్లనామ్ కర్షిక టూరిజం డెవలప్మెంట్ సొసైటీ కేరళ ఫిషరీస్ అండ్ ఓషియన్ స్టడీస్ యూనివర్సిటీ(కేయూఎఫ్వోఎస్)కి లేఖ రాసింది. ప్రస్తుతం కేయూఎఫ్వోఎస్ ఈ దీవి ఎలా ఏర్పడింది… ఎందుకు మాయం అయిందన్నదానిపై పరిశోధనలు చేస్తున్నది. అది ఇసుక మేట కావొచ్చని, అలలకు కొట్టుకొచ్చి ఉండవచ్చని, మళ్లీ అలల ధాటికి నీళ్లలో మునిగిపోయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.