ప్రాజెక్టులోకి గోదారమ్మ పరుగు
నేటి తెల్లవారు జామున పారనున్న అలుగు
రెండు, మూడు రోజుల్లో మంజీరా వాగులోకి..
ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ ద్వారా 2900 ఎకరాల ఆయకట్టు
వెల్దుర్తి, ఏప్రిల్ 15 : కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాలు హల్దీవాగులోకి బిరబిరా వస్తున్నాయి. జలాలతో మాసాయిపేట మండల పరిధి హక్కీంపేట గ్రామశివారులో ఉన్న హల్దీవాగు ప్రాజెక్టు మండుటెండల్లోనూ నిండుకుండను తలపిస్తున్నది. గత వర్షాకాలంలో కురిసిన వర్షాలతో అలుగుపారిన హల్దీవాగు ప్రాజెక్టు, యాసంగి సాగులో భారీగా ఆయకట్టు రైతులు సాగు చేయడంతో తూముకు అందని దూరంలో నీళ్లు నిలిచాయి. హల్దీవాగు, మంజీరా పరీవాహక ప్రాంతాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదముందన్న ఎమ్మెల్యేల విజ్ఞప్తితో సీఎం కేసీఆర్ స్వయంగా ఈ నెల 6న సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీవాగు ద్వారా మంజీరాకు నీటిని వదలారు. దీంతో తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పర్వదినాన నర్సాపూర్ నియోజకవర్గం అయిన మాసాయిపేట మండలంలో గోదావరి జలాలు ప్రవేశించాయి. మాసాయిపేట, వెల్దుర్తి మండలాల వరప్రదాయిని అయిన హల్దీవాగు ప్రాజెక్టులో మంగళవారం ఉదయం నుంచి వస్తున్న గోదావరి జలాలలో రోజురోజుకూ నీటిమట్టం పెరిగి, మూడు రోజుల తర్వాత శుక్రవారం తెల్లవారుజామూన అలుగు పారడానికి హల్దీవాగు ప్రాజెక్టు సిద్ధంగా ఉంది.
కాగా, ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా మాసాయిపేట, వెల్దుర్తి, చిన్నశంకరంపేట మండలాల్లో 14 గ్రామాల పరిధిలో 2900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. కుడి కాలువ ద్వారా రెండు వేల ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 900 ఎకరాల్లో పంటలకు నీరు చేరనున్నది. ఎడమ కాలువ మాసాయిపేట మండల పరిధిలోని కొప్పులపల్లి, వెల్దుర్తి మండలంలోని హస్తాల్పూర్, నెల్లూర్, పెద్దాపూర్, వెల్దుర్తి, కుకునూర్, కుడి కాలువ ద్వారా మాసాయిపేట మండలంలోని హక్కీంపేట, అచ్చంపేట, చిన్నశంకరంపేట మండలంలోని ధరిపల్లి, సూరారం, చందంపేట, జంగరాయి, వెల్దుర్తి మండలంలోని ఉప్పులింగాపూర్, బండపోసాన్పల్లి గ్రామాలకు సాగునీరు పారుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1647 అడుగులు కాగా, 800 మీటర్ల మేర కట్టిన అలుగు ద్వారా 65 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహానికి అనుగుణంగా నిర్మించారు.
ఇవి కూడా చదవండి
చీరలో రుక్మిణి స్టంట్స్ వీడియో వైరల్
మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి