అమరావతి : ఆంధ్రప్రదేశ్పై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ, పక్షపాత ధోరణి అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. విభజన చట్టం హామీలను నెరవేర్చకుండా తెలుగు ప్రజలందరికీ కేంద్రం ద్రోహం చేస్తున్నదని ఆయన విమర్శించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన కేంద్ర అఖిలపక్ష సమావేశానికి ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి హాజరయ్యారు. సమావేశం అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను సమావేశంలో ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు.
‘‘పోలవరం పునరావాస ప్యాకేజ్ త్వరగా ఇవ్వాలని కోరాం. ప్యాకేజ్ విడుదలలో జాప్యం చేయడం ఏపీకి ద్రోహం చేయడమే అని చెప్పాం. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని స్పష్టం చేశాం. స్టీల్ప్లాంట్ను లాభాల్లోకి తెచ్చేందుకు ఉన్న 3 అవకాశాలను పరిశీలించాలన్నాం. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి ప్రస్తావించాం. ఏడేళ్లయినా విభజన హామీలను అమలు చేయలేదు. పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ.. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కోరాం. బియ్యం సబ్సిడీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అభ్యర్ధించాం. పోలవరం, ప్రత్యేక హోదా అంశాల్లో కేంద్రం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నది. పెండింగ్లో ఉన్న దిశ బిల్లును క్లియర్ చేయాలని కేంద్రానికి విన్నవించాం’’ అని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లోనూ ఈ అంశాలను ప్రస్తావిస్తామని ఆయన పేర్కొన్నారు.