వర్గల్, ఏప్రిల్ 9 : పవిత్ర గోదావరి జలాలు పరుగు పరుగునా ఉరకలేస్తూ శుక్రవారం వర్గల్ మండలంలోని ఊర్లు, కుంటలు, చెరువులు ఒర్రెలు, వంపులు తిరుగుతూ హల్దీవాగులోకి పయనమయ్యాయి. గోదావరి జలాలను విడుదల చేసి నాల్గో రోజుకు చేరడంతో సంగారెడ్డి కాలువ నుంచి నీటి ప్రవాహం ఉప్పొంగుతూ కాలువ ద్వారా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చౌదర్పల్లి బంధం చెరువు, వర్గల్ పెద్ద చెరువు, శాకారం ధర్మాయి చెరువులను దాటి అంబార్పేట ఖాన్ చెరువులోకి వెళ్లాయి. నేడు ఖాన్ చెరువును నుంచి హల్దీవాగు ద్వారా మెదక్ జిల్లాలోకి వెళ్లనున్నాయి. కాగా, వర్గల్ పెద్ద చెరవు, శాకారం చెరువుల వద్ద సందర్శకులు సంబురాలు చేసుకున్నారు. వాగులో స్నానాలు చేస్తూ సెల్ఫీలు తీసుకున్నారు. ధర్మాయి చెరువుకు శాకారం సర్పంచ్, ఉపసర్పంచ్ పంగభాగ్యప్రభాకర్, రంగా భాస్కర్గౌడ్ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.