శ్రీకాకుళం : కొవిడ్-19తో బాధపడుతున్న మహిళను దవాఖానకు తరలించగా రూ 60,000 అడ్వాన్స్ చెల్లించాలని కోరడంతో కుటుంబసభ్యులు ఏటీఎం కోసం గాలించే క్రమంలో మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో వెలుగుచూసింది. ఆస్పత్రి రిసెప్షన్ లో రూ 60,000 నగదు అడ్వాన్స్ గా చెల్లించాలని నిర్వాహకులు కోరడంతో చికిత్సలో జాప్యంతో దారుణం జరిగింది. నగదును డ్రా చేసేందుకు తాము ఏటీఎంల కోసం తిరిగామని వీడియోలో ఓ వ్యక్తి చెబుతుండటం కనిపించింది. బాధిత మహిళను రాజాం మండలం వీఆర్ అగ్రహారానికి చెందిన ఎన్ . అంజలిగా గుర్తించారు. అంజలిని ఆటో డ్రైవర్, మహిళా అటెండెంట్ చూస్తుండగా కుటుంబ సభ్యులు నగదు కోసం ఏటీఎంల చుట్టూ తిరిగారు. ఈ లోగా అంజలి పరిస్థితి విషమించింది.
కుటుంబ సభ్యులు పలుమార్లు కోరినా కనీసం ఆక్సిజన్ పెట్టేందుకూ ఆస్పత్రి వర్గాలు నిరాకరించాయని మహిళ బంధువులు ఆరోపించారు. మహిళ మృతదేహాన్ని ఆస్పత్రి వెలుపలి నుంచి స్మశానవాటికకు తరలించేందుకు సైతం అక్కడే ఉన్న పోలీసులు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ సహకరించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు మహిళను తీసుకువచ్చినప్పుడు అక్కడ సిబ్బంది ఎవరూ లేరని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. మహిళ కుటుంబ సభ్యుల ఆరోపణలను తోసిపుచ్చాయి. ఘటనపై సమాచారం అందుకున్న శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ ఎన్ రమేష్ స్పందించి మహిళ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు వాహనం ఏర్పాటు చేశారు. కాగా ఈ ఉదంతంపై తమకు ఇంతవరకూ అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాజాం పోలీసులు తెలిపారు.