తెలుగును భావితరాలకు అందించాలి
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): ‘మాతృభాష జాతి ఔన్నత్యానికి ప్రతీక. మన తెలుగు భాషను కాపాడుకోవాలి. అభివృద్ధి చేసుకోవాల’ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. తెలుగు భాషకు పట్టాభిషేకం చేయడం తెలుగు జాతి ప్రజలుగా మనల్ని మనం గౌరవించుకోవడమేనని పేర్కొన్నారు. తెలుగును భావితరాలకు అందించడం మన బాధ్యత అని, దానిని విస్మరిస్తే భవిష్యత్తు తరాలు క్షమించబోవని చెప్పారు. ఉద్ధండ పండితుడు, పంచ సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ తిరుపతి నుంచి వర్చువల్గా నిర్వహిస్తున్న అష్టావధానంలో ఆదివారం జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని చెప్పారు. తెలుగు భాషకు ఆదరణ తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భాషను, క్లిష్టమైన సాహితీ, సంప్రదాయాలను కాపాడుకొనేందుకు రెట్టిం పు కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. పర్యావరణ మార్పులకు తగినట్టుగా మారగలిగిన జీవులే మనుగడ సాగిస్తాయని, అలాగే సాహితీ ప్రక్రియలు సైతం సమకాలీన సమాజానికి అద్దం పట్టేలా తగిన మార్పులు, సర్దుబాట్లు చేసుకున్నప్పుడే వాటికి మనుగడ, ఆదరణ ఉం టుందని వివరించారు. ‘కళ.. కళ కోసం కాకూడదు. ప్రజల కోసం కావాలి. సాహిత్యం కూడా ప్రజల గొంతులో గొంతు కై, ప్రజల పలుకులో పలుకై నడవాలి. అప్పుడు ప్రజలే కళను, సాహిత్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటార’ని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో దేశవిదేశాల పండితులు పాల్గొన్నారు.