మాన్సాస్ ట్రస్ట్ వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మాన్సాస్, సింహాచలం ట్రస్ట్ చైర్పర్సన్గా సంచయిత గజపతిరాజును నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం. 72ను ఏపీ హైకోర్టు తాజాగా రద్దు చేసింది. చైర్పర్సన్గా సంచయిత నియామకం చెల్లదని స్పష్టం చేసింది. గతంలో చైర్మన్గా పనిచేసిన అశోక్ గజపతిరాజునే ఆ పదవిలో కొనసాగించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అశోక్ గజపతిరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అయితే హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ఏపీ ప్రభుత్వం వెల్లడించడంతో మాన్సాస్ ట్రస్ట్ వివాదం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఈ వివాదం ఎలా మొదలైంది? అసలు ఎవరీ సంచయిత గజపతి రాజు ? అశోక్ గజపతి రాజుతో ఆమెకు ఉన్న గొడవ ఏంటి ఒకసారి చూద్దాం..
మహారాజ అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ (MANSAS)ట్రస్ట్ను పూసపాటి వంశీయులైన పూసపాటి విజయరామ గజపతి (పీవీజీ) రాజు 1958లో ప్రారంభించారు. తన తండ్రి జ్ఞాపకార్థం ఆయన ఈ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పీవీజీ రాజు వ్యవస్థాపక చైర్మన్గానూ ఆయన కుమారులైన ఆనంద గజపతి రాజు, అశోక్ గజపతిరాజు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఉండేవారు. 1994లో పీవీజీ మరణం తర్వాత ఆయన పెద్ద కుమారుడు అనంద గజపతి రాజు చైర్మన్ అయ్యారు. 2016లో ఆనంద గజపతి రాజు మరణించడంతో అశోక్ గజపతి రాజు ట్రస్ట్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు.
ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 14,800 ఎకరాల భూమి మాన్సాస్ ట్రస్ట్ పేరిట ఉంది. ఈ భూముల విలువ దాదాపు 50 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇవి కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో 108 ఆలయాలు, వాటి భూములు కూడా ట్రస్ట్ పరిధిలోకే వస్తాయి. అలాగే సింహాచలం వరాహ నరసింహస్వామి ఆలయం, అరసవెల్లి సూర్యదేవాలయం, విజయనగరంలోని పైడి తల్లి అమ్మ వారి ఆలయం కూడా ఈ ట్రస్ట్ పరిధిలోనే ఉన్నాయి. తమిళనాడులో కూడా భూములు ఉన్నాయి. ఈ మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 12 విద్యాసంస్థలు నడుస్తున్నాయి. వీటిలో 15 వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు.
ఆనంద గజపతి రాజు మరణానంతరం ఆయన సోదరుడు, అప్పటి కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుకు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా అప్పటి టీడీపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఆయన కుమార్తె అదితి గజపతిరాజును, మరో ఇద్దరు ఆర్థిక నిపుణులను ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమించింది. కానీ గత ఏడాది సడెన్గా ఆనంద గజపతి రాజు రెండో కుమార్తె సంచయితను ఏపీ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతి రాజును తప్పించి సంచయితకు ఆ పదవిని అప్పగిస్తూ జీవో జారీ చేసింది. అలాగే ఆనంద గజపతి రాజు కుమార్తె ఊర్మిళా గజపతి రాజు, పీవీజీ రాజు కుమార్తె ఆర్వీ సునీతా ప్రసాద్, అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి విజయలక్ష్మి, అరుణ్ కపూర్, విజయ్ కె. సొంది, విజయనగరం వైసీపీ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ను బోర్డు సభ్యులుగా నియమించింది. అయితే దీనిపై అశోక్ గజపతి రాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వంశపారంపర్యంగా వస్తున్న ట్రస్ట్ కావడంతో పెద్ద వారికే ట్రస్ట్ చైర్మన్గా ఉండే అవకాశం ఉంటుందని ఆయన కోర్టుకు పేర్కొన్నారు. కానీ నిబంధనల ప్రకారం రొటేషన్ పద్ధతిలో సంచయితకు అవకాశం ఇచ్చినట్లు ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తాజాగా ఈ ఉత్తర్వులను కొట్టేసింది.
సంచయితను మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా నియమించిన తర్వాత గజపతి రాజుల కుటుంబంలోని వివాదాలు రచ్చకెక్కాయి. కానీ పీవీజీ రాజు కుమారులైన ఆనంద గజపతి రాజు, ఆయన సోదరుడు అశోక్ గజపతి రాజు కుటుంబాల మధ్య మొదటి నుంచే కొన్ని వివాదాలు ఉన్నాయి. అశోక్ గజపతి రాజు మొదటి నుంచి టీడీపీలో ఉండగా.. ఆనంద గజపతి రాజు కాంగ్రెస్, టీడీపీల్లో పనిచేశారు. దీంతో వీరిమధ్య రాజకీయ విభేదాలు కూడా ఉండేవి. ఆనంద గజపతి రాజు ఉమను రెండో వివాహం చేసుకున్నారు. ఈమె విశాఖ నుంచి ఎంపీగా కూడా గెలిచారు. ఉమా గజపతి రాజు రెండో కుమార్తెనే సంచయిత. ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ కాకముందు ఆమె ఢిల్లీలో ఉండేవారు. బీజేపీ యువ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగానూ ఆమె కొనసాగారు. అయితే అశోక్ గజపతి రాజు కుటుంబంతో సంచయితకు మొదటి నుంచి ఎటువంటి సన్నిహిత సంబంధాలు ఉండేవి కావు.
– నవీన్ కుమార్ రెడ్డి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అంత్యక్రియల వేళ తల్లి మాట విని లేచిన కొడుకు
సింహాలతో కొట్లాడి పిల్లను దక్కించుకున్న బర్రె.. వీడియో వైరల్
యువరాణి నిర్ణయం: రూ.14 కోట్ల భత్యం నిరాకరణ
అందనంత దూరాన రహస్యకొండ..హబుల్ టెలిస్కోప్కు చిక్కింది..!!వీడియో
ఇంటర్నెట్ డౌన్.. బ్యాంకులు, ఎయిర్లైన్స్ వెబ్సైట్లు క్రాష్
కర్ణాటక సీఎంను మార్చాలన్న బీజేపీ ఎమ్మెల్సీ