అమరావతి : ఇటీవల కురిసిన వర్షాలకు, వరదలకు కడప జిల్లా రాజంపేటలో అన్నమయ్య జలాశయం తెగి నష్టపోయిన బాధితులకు అండగా ఉంటామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పేర్కొన్నారు. శుక్రవారం అన్నమయ్య జలాశయం వల్ల దెబ్బతిన్న పులపుత్తూరు గ్రామాన్నిసందర్శించి బాధితులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో వరదతో భారీ నష్టం సంబవించిందని ఆయన అన్నారు.
ఇంతటి విపత్తు జరిగితే కనీసం కేంద్రంలోని మంత్రులు ఎవరూ కూడా సందర్శించకపోవడం, వారిని ఆదుకోకపోవడం విచారకరమని అన్నారు. ఈ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, బాధితులకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జలశయాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాలని రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి సూచించారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగేంత వరకు పోరాటాలు చేస్తామని వెల్లడించారు.