అమరావతి : ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో కృష్ణా జిల్లా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలో నీటిమట్టం పెరిగింది. వరద ఉధృతంగా ఉండటంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి సుమారు 2 లక్షల క్యూసెక్కులను సముద్రంలో విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు 17 గేట్లను ఎత్తడంతో ప్రకాశం బ్యారేజీకి లక్షన్నర క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తున్నది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణమ్మ ఉధృతితో విజయవాడలోని కృష్ణలంక, తారకరామనగర్లోని పలు ఇళ్లు నీటమునిగాయి. అధికారులు వరద వస్తుందనే చెప్పారు తప్పా.. తాత్కాలిక ఆవాసం చూపలేదని ముంపు బాధితులు ఆరోపించారు. ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.