అమరావతి : కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని అతలాకుతలం చేస్తోంది. కరోనా కాటుకు మరో పూజారి బలయ్యాడు. బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అర్చకుడు రాచకొండ శివప్రసాద్ను కరోనా మింగేసింది. వారం రోజుల క్రితం శివప్రసాద్కు కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో పూజారి విజయవాడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొంది శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. అంతలోనే శివప్రసాద్ ఆరోగ్యం విషమించడంతో శనివారం ఇంటి వద్దే ప్రాణాలు కోల్పోయాడు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఇప్పటివరకు 40 మందికిపైగా ఉద్యోగులు కరోనా బారినపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం వరకు కొత్తగా 11,698 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19 కారణంగా 37 మంది మృత్యువాతపడ్డారు. 4,421 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా కేసుల సంఖ్య 10,20,926 చేరింది, మొత్తం మరణాలు 7616. యాక్టివ్ కేసులు 81,471.
జిల్లాల వారీగా తూర్పు గోదావరి, నెల్లూరులో ఆరుగురు, అనంతపూర్, చిత్తూర్లో నలుగురు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, గుంటూరు, కృష్ణ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలో ఇద్దరు, ప్రకాశం ఒక్కరు చొప్పున మరణించారు.