విజయవాడ: విజయదశమి సందర్భంగా విజయవాడ దుర్గామాత ఆలయంలో అమ్మవారి ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. జలవిహారం లేకుండానే తెప్పోత్సవం నిర్వహించనున్నారు.. ఈ వేడుకను తిలకించేందుకు పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతి లభించింది.
దుర్గాఘాట్, పున్నమిఘాట్, ఫ్లైఓవర్ నుంచి ఈ తెప్పోత్సవం దర్శించేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతానికి ఉత్సవమూర్తులు దుర్గాఘాట్ చేరుకున్నాయి. కాసేపట్లో హంసవాహనంపై ఆదిదంపతులకు పూజాకార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇదిలా వుండగా, విజయదశమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రిపై విపరీతమైన రద్దీ ఏర్పడింది. దేవీ నవరాత్రుల చివరి రోజు కావడంతో క్యూలైన్లలో రద్దీ విపరీతంగా ఉంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. రద్దీతో ఇబ్బందులు పడుతున్న భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవానీలకు ప్రత్యేక ఏర్పాట్లు లేవని ఆరోపిస్తున్నారు.