అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ‘నదీనదాలు, కొండలు, ఎడారులా మనకడ్డంకి అన్న శ్రీశ్రీ మాటలను వారు మరోలా అర్థం చేసుకున్నారు. ల్యాండ్ కనిపిస్తే చాలు పచ్చజెండా పాతేశారు పత్తిపాటి పుల్లన్న. జూబ్లీహిల్స్ సొసైటీ బోర్డునే తొలగించి కబ్జా చేసిన వారికి…విశాఖ భూములు ఒక లెక్కా? వైసీపీ వచ్చిన తర్వాత వీరి కబ్జాలకు తెరపడిందని’ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
‘నలుగురు ఎవరి గురించైనా అభిమానంగా చర్చించుకుంటున్నా, మీడియాలో హడావుడి కనిపించినా బాబు వక్ర దృష్టి అటు పడుతుంది. అందులోకి ఎలా దూరాలా అని ఆలోచిస్తాడు. ఇప్పుడు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య క్రెడిట్ ను ఎలా కొట్టేయాలా అని స్కెచ్ వేస్తున్నాడు గుంట నక్కలా.చంద్రబాబులాంటి వారిని తమ దేశంలో అయితే జైలు లేదా పిచ్చాసుపత్రిలో వేస్తారని స్విట్జర్లాండ్ మంత్రి పాస్కల్ కూషెపిన్ 21ఏళ్ల క్రితం వాతలు పెట్టాడు. అయినా అమరావతిలో ఒలంపిక్స్, ప్రతి ఇంటికీ ఏసీ పైపులైన్లు, హైపర్ లూప్ వ్యవస్థ తెస్తాలాంటి సొల్లు కబుర్లు చెప్పబట్టే ప్రజలు తరిమి కొట్టారని’ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.