అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై చంద్రబాబుతో సహా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు,పలువురు టీడీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి ప్రతిపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.
‘దిగజారుడు అనేది జారుడు బండ లాంటిది. పతనం వైపు, వెనక్కి రాలేనంతగా నెడుతూనే ఉంటుంది. ఎందుకిలా జరిగింది అని ఆలోచించుకునేటప్పటికి టైం మించి పోతుంది.. ఎవరో రెచ్చగొడితే, ఈల వేస్తే, అన్నీ వదిలేసి బట్టలు చించుకుంటే ఇలాగే అవుతుంది. స్వయంకృతానికి బాధ్యులుండరు. జగన్ గారిని అప్రతిష్ట పాలు చేయడానికి ఎల్లోమీడియా, బాబు మనుషులు తాము ఏడవాలనుకున్నవన్నీ రఘురామ, ఆయన కుటుంబ సభ్యులతో చెప్పిస్తున్నారు. వాడుకోవడం, వెన్నుపోటు పొడవడం ఈ గ్యాంగుకు బాగా తెలిసిన విద్య. కడప పేరు చెప్పించి అక్కడి ప్రజలను అవమానించాలని కుట్రలు పన్నుతున్నారని’ విజయసాయిరెడ్డి ఆరోపించారు.
‘అరెస్టైంది అధికార పార్టీ ఎంపీ. మరి విపక్షాలు, పచ్చ మీడియా వాళ్లు గింజుకుంటున్నారేంటి? వారి శోకాలు చూస్తే అసలు గుట్టు బయటపడేలా ఉంది. అచ్చెం, ధూళిపాళ్ల, కొల్లు అరెస్టైనప్పుడు కూడా టీడీపీలో ఈ ఏడుపులు, పెడబొబ్బలు లేవే. అంతగా పెనవేసుకుపోయాడా ఈ ఖైదీ 3468? అద్దె మైకులిచ్చింది మీరేనా?’ అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.