తిరుపతి : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీకృష్ణ ముఖమండపంలో శుక్రవారం వరలక్ష్మీవ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. విష్వక్సేనారాధనతో ప్రారంభించి పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి తదితర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామర, వృక్షి తదితర పుష్పాలతో ఆరాధించారు. అదేవిధంగా అమ్మవారిని 9 గ్రంథులతో అలంకరించారు. వరలక్ష్మీ వ్రతం మహత్యాన్ని, ఆచరించాల్సిన విధానాలను ఆగమ పండితుడు శ్రీ శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఐదు రకాల కుడుములతోపాటు 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు.
అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది. భక్తుల కోసం శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, రాష్ట్ర మంత్రి వేణుగోపాల కృష్ణ, టీటీడీ ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, జేఈఓ సదా భార్గవి, సీవీఎస్ఓ గోపీనాథ్ జెట్టి, అదనపు సీవీఎస్ఓ శివకుమార్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ కస్తూరి బాయి, ఏఈఓ ప్రభాకర్రెడ్డి, అర్చకులు బాబుస్వామి పాల్గొన్నారు.