అమరావతి, జూన్,5 : హనుమంతుడి జన్మస్థలం పై టీటీడీ ఈవో జవహర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని ఆయన స్పష్టం చేశారు. హనుమ జన్మస్థలం గురించి తమ వద్ద ఉన్న ఆధారాలను ఇప్పటికే చూపామని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బగా తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో టీటీడీ ఈవో జవహర్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హనుమంతుని జన్మస్థలంపై చోటు చేసుకొన్న వివాదాలు త్వరలోనే సర్దుమణుగుతాయన్నారు. అంజనాద్రిలో జపాలి, ఆకాశగంగ తీర్థాలు పక్క, పక్కనే ఉన్నాయన్నారు.
గోవిందానంద స్వామి ఏదేదో మాట్లాడుతున్నారనిఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారన్నారు. గోవిందానంద సరస్వతీ స్వామి టీటీడీపై విమర్శకు పరిమితం అవుతున్నారని, ఆయన చూపిన ఆధారాలు సరిగా లేవని చెప్పారు. టీటీడీ తప్పు చేస్తోందన్న భావన ప్రజల్లో కలిగేలా ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పురాణాలను కూడా ఆయన విశ్వసించడం లేదన్నారు. సరైన ఆధారాలుంటే ఎవరైనా తీసుకురావొచ్చని.. అంతేకాని విమర్శలు చేయడమే పనిగా పెట్టుకోవద్దని పేర్కొన్నారు. తాము చూపుతున్న ఆధారాలకంటే బలమైన ఆధారాలు చూపితే అంజనాద్రి ఆంజనేయస్వామి జన్మస్థలంపై పునరాలోచిస్తామవి తెలిపారు. అప్పటివరకు అంజనాద్రే హనుమంతుడి జన్మస్థానమని ఆయన స్పష్టం చేశారు.