శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదురోజులపాటు వైభవంగా కొనసాగనున్నాయి. ఉదయం ఆలయ ఈఓ కేఎస్ రామారావు యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలను ఆరంభించారు. ఈవో దంపతులు దీక్ష వస్త్రాలతో ఆది దంపతులను దర్శించుకున్నారు.
వేదపండితులతో కలిసి గణపతి పూజ, చండీశ్వర పూజ, కంకణ ధారణ, రుత్విగ్వరణం, వేదస్వస్తి, అఖండ దీప కలశస్థాపన, రుద్ర కలశస్థాపన పూజలు చేశారు.
అమ్మవారికి విశేష కుంకుమార్చన, నవావరనార్చన, చండీ హోమాన్ని నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణ పూజ తరువాత స్వామి అమ్మవార్లను భృంగి వాహనంపై అధిష్టింపజేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు.
శ్రీభ్రమరాంబ అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
దర్శనానికి వచ్చిన భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించిన అనంతరమే ఆలయం లోపలికి అనుమతిస్తున్నారు.
అధిక శరీర ఉష్ణోగ్రత ఉన్న వారిని దేవస్థానం ప్రాథమిక దవాఖానకు తరలిస్తున్నట్లు ఆలయ పరిపాలన విభాగ పర్యవేక్షకులు తెలిపారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా మాస్కులను సాధారణ ధరలకే విక్రయించాలని రెవెన్యూ శాఖ అధికారులు వ్యాపారులకు సూచించారు.
స్వామివారిని దర్శించుకున్న భక్తులు వెంటనే స్వస్థలాకు తిరుగు ప్రయాణం అవ్వాలని ఈఓ కేఎస్ రామారావు విజ్ఞప్తి చేశారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో క్షేత్రంలో భక్తుల రద్దీ లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆలయ పరిసరాల్లో ఫుట్పాత్లను ఆక్రమిస్తూ చిరు వ్యాపారాలు, తోపుడు బండ్లు పెడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
సుమారు వెయ్యి మందికిపైగా వలస వ్యాపారులు కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, భక్తుల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని ఆలయ భద్రతాధికారి నరసింహా రెడ్డి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి