శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి. తొలిరోజు ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగాయి. సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఉత్పమూర్తులను భృంగివాహనంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భృంగివాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను దర్శించుకొని భక్తులు తరలించారు. భృంగివాహనంపై ఆశీనులైన ఆదిదపంతులను దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని, పనుల్లో ఏకాగ్రత లభిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి.
కన్నడిగుల ఇలవేల్పు శ్రీభ్రమరాంబ అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో విశేష పూజలు అందుకుంది.
ఈ అలంకరణలో చతుర్భుజాలు కలిగి పైరెండు చేతుల్లో పద్మాలు, కుడివైపు
అభయ హస్తం, ఎడమవైపు వరముద్రతో దర్శనమిస్తుంది.
ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే శత్రుబాధలు తొలగి.. సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
వాహన పూజల అనంతరం ఆలయ ప్రధాన రాజగోపురం నుంచి బయలు వీరభద్రస్వామి వరకు స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం కన్నుల పండగగా సాగింది.
గ్రామోత్సవంలో మహిళల కోలాటం, జానపద కళాకారులపగటి వేషాలు, బుట్టబొమ్మలు, గొరువ నృత్యం, తప్పెట చిందు, కర్ణాటక జాంజ్, కొమ్మువాయిద్యం, జానపదడోలు, నందికోలుసేవ, కంచుడోలు విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో ఈఓ కేఎస్ రామారావుతోపాటు ఈఈ మురళీ బాలకృష్ణ, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి, పీఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకులు అనిల్ కుమార్, ఏఈఓలు మల్లయ్య, హరిదాస్, కృష్ణారెడ్డి, డీఈలు శ్రీనివాస్ రెడ్డి, నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్ అయ్యన్న, రెవెన్యూ అధికారి శ్రీహరి, పర్యవేక్షకులు ఉమేశ్ పట్వారీ, హిమబిందు అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి