తిరుమలలోని ఆకాశగంగ ప్రాంతం హనుమంతుని జన్మ స్థలమని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కమిటీ ప్రకటించిన నేపథ్యంలో ఆకాశగంగ వద్ద ఈ నెల నాలుగో తేదీ నుంచి 8వ తేదీ దాకా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు.
తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ పంచాంగంలో నిర్దేశించిన ప్రకారం ప్రతి ఏటా చేసే కార్యక్రమాలు యథాతథంగా చేస్తామన్నారు. ఈ సారి ఆకాశగంగలో 4వ తేదీ నుంచి 8వ తేదీ దాకా రోజూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వివరించారు.
ప్రతిరోజూ ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు అంజనాదేవి, బాల హనుమంతల వారికి అభిషేకం, రోజుకొక పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ధర్మారెడ్డి చెప్పారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు హనుమాన్ చాలీసా ఉంటుందన్నారు. తిరుమలకు వచ్చే యాత్రికులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనుమతిస్తామన్నారు.
వచ్చే ఏడాది మరింత వైభవంగా ఆకాశగంగ వద్ద హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంజనేయ స్వామి రాక్షసుల బారి నుంచి ప్రజలను విముక్తులను చేశారని, కరోనా మహమ్మారి నుంచి ప్రజలను విముక్తులను చేయడానికి కూడా ఈ కార్యక్రమాలన్నీ ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.