న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,241.10 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ. 1,322.30 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 6.14 శాతం తక్కువ. 2019-20 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.17,187.30 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.22,959.80 కోట్లకు పెరిగినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఆదాయంలో 33.58 శాతం వృద్ధి కనబరిచింది. నాలుగో త్రైమాసికంలో మొత్తంగా 4,92,235 వాహనాలను విక్రయించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.66,571.80 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.4,389.10 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకున్నది. గతేడాదికిగాను రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.45 డివిడెండ్ను కంపెనీ బోర్డు ప్రతిపాదించింది.