కుత్బుల్లాపూర్,ఏప్రిల్19: ఒకప్పుడు ఠాణాకు వెళ్లాలంటేనే అదో రకమైన భయం..ఠాణా ముందు నుంచి చూస్తే ఏదో తెలియని వణుకు. ఇకవేళ ధైర్యం చేసి లోపలికి వెళితే అదో రకమైన గుబులు. కానీ ఇప్పుడు పూర్తిగా భిన్నంగా మారింది. స్వరాష్ట్రంలో పోలీస్స్టేషన్లు కొత్తగా కనబడుతున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్తో పాటు పర్యావరణ ప్రేమికులుగా స్వాగతం పలుకుతున్నాయి.నిర్భయంగా ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు స్వేచ్ఛాయుతమైన పచ్చటి వాతావరణం ఆహ్వానం చెబుతుంది. ఎటు చూసినా రంగురంగుల అలంకరణలు… పచ్చటి వనాలు..ఆకర్శించే పూలమొక్కలు..పసందుగా హాయినిచ్చే ఆహ్లాదకరమైన వాతావరణం..అన్నింటికి మించి ఎంతటి ఆవేశాలు..కుట్రలు, ఇతర సంఘటనల తో కిక్కిరిసిపోయే మనస్సును ప్రశాంతపరిచే కేంద్రానికి నిలయంగా ఇప్పటి ఠాణాలు నిలుస్తున్నాయి. అందులో భాగంగానే పేట్బషీరాబాద్ ఠాణా ఒకటి.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ కార్యాలయం, సర్కిల్ కార్యాలయం, మహిళా భద్రత కేంద్రాల్లో ప్రజలకు నిత్యం పలు సేవలను అందిస్తుంది. ఠాణాలో ప్రవేశించే ద్వారం నుంచి మొదలు కొని కార్యాలయం ఆవరణలోనూ పూలమొక్కలు, తీరొక్క రకమైన కుండీలలో ఆకర్శించే పువ్వులతో పచ్చటి అలంకరణ దీపంలా దర్శనమిస్తుంది.కార్యాలయాల ఆవరణలో ఉన్న గార్డెనింగ్ మొక్కలు, మామిడి, కొబ్బరి, ఉసిరి, నిమ్మ, జామ వంటి పండ్ల చెట్లతో పాటు ఆకట్టుకునే షో చెట్లతో పచ్చటి మైదానాన్ని పరుచుకొని హాయినిస్తుంది. హారితవనం లాంటి పెద్దపెద్ద వృక్షాలతో వేసవిలోనూ చల్లటి నీడను, గాలినిచ్చే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది.
ప్రజలకు మాత్రమే భద్రతను కల్పించడమే కాదు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పచ్చటి వనాలను తీర్చిదిద్దేందుకు ముందున్నామని చెప్పుకునేందుకు అనునిత్యం ప్రతి మొక్క పరిరక్షణ కోసం సిబ్బంది తీర్చిదిద్దుతున్నారు. ఎండ వేడిమికి తాళలేక పచ్చదనం కరువైతుందనే దానికి తావునివ్వకుండా ప్రతి మొక్కను ప్రత్యేకంగా రక్షణ కల్పించడం ద్వారా ఇప్పుడు అందులో ఉన్న పండ్ల మొక్కలు విరగగాసి చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఠాణాను హరితవనంలా తీర్చిదిద్దాం. పర్యావరణాన్ని పరిరక్షించడం మన బాధ్యతగా గుర్తు చేస్తూ..మనం ఉండే పరిసరాలను పరిశుభ్రంగా చూసుకోవడంతో పాటు పచ్చటి వాతావరణాన్ని అందించేందుకు వీలుగా చూసుకుంటున్నాం. హరితభవనాల్లో ఠాణాను ఆదర్శంతంగా తీర్చిదిద్దేందుకు తీరొక్క మొక్కలను నాటుతున్నాం. -ఎస్.రమేశ్, సర్కిల్ ఇన్స్పెక్టర్, పేట్బషీరాబాద్