కరోనాతో మరణించిన వారికి అంత్యక్రియలు
మానవత్వం చాటుతున్న ఖాదర్ బాయ్ టీం
42 మృతదేహాలకు అంత్యక్రియలు
ఆపద్బాంధవులకు పలువురి అభినందనలు
కరోనా సోకిన వారిని పలుకరిస్తేనే తమకెక్కడ సోకుతుందోననే భయం.. ఎవరైన మరణిస్తే ఆ దారి నుంచి పోవడానికే వెనుకంజ వేస్తున్న దుర్భర పరిస్థితులు.. మరణించిన వ్యక్తిని ముట్టుకోవడానికి కుటుంబసభ్యులూ వెనుకడుగు వేస్తున్న తరుణం. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుతూ వారి అంతిమ సంస్కారాలు చేయాలని ఉన్నా.. చేయూత నందించేందుకు ఎవరూ తోడు రాక దిక్కుతోచని స్థితిలో కన్నీటి పర్యంతమవుతున్న వారికి ఆ నలుగురు అండగా నిలుస్తున్నారు. అంతా తామై ఆత్మ బంధువులుగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మానవత్వం బతికే ఉందని చాటుతున్నారు.. వారే అబ్దుల్ ఖాదర్ బృందం.
కల్వకుర్తి, మే 22: కల్వకుర్తి పట్టణానికి చెందిన అబ్దుల్ ఖాదర్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. గతేడాది కొవిడ్ నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి తిరిగి కల్వకుర్తికి వచ్చాడు. చిన్న చితక వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. స్థానిక జామ మసీదు కమిటీ సభ్యుడిగా తనకు చేతనయినంత సహాయం చేస్తున్నాడు. గతేడాది ఆగస్టులో ఓ మిత్రుడు సాయంత్రం వేళలో ఏడుస్తూ ఖాదర్కు ఫోన్ చేశాడు. మా అమ్మ కరోనాతో చనిపోయింది.. కనీసం అంబులెన్స్ నుంచి దించడానికి ఎవరూ రావడం లేదంటూ చెప్పాడు. అంతే.. వెంటనే మిత్రుడి వద్దకు వెళ్లాడు. అంబులెన్స్ను శ్మశానవాటిక వద్దకు తీసుకెళ్లి మిత్రుడితో కలిసి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మృతదేహానికి అంత్యక్రియలు చేశాడు. అంతమంది బంధువులు ఉండి కూడా అంత్యక్రియలకు సహాయం చేయకపోవడమేమిటని తనలో తానే ప్రశ్నించుకోసాగాడు. మరో వారం రోజులకు ఇలాంటి ఘటన జరిగింది. ఖాదర్ ఒకటే ఆలోచనకు వచ్చాడు. అంత్యక్రియలు చేయడానికి ఎవరూ లేక అసహాయ స్థితిలో ఉన్న వారికి చేయూతనందించాలని నిర్ణయించుకున్నాడు. ఖాదర్ చేస్తున్న పనికి మరో ముగ్గురు స్నేహితులు తోడయ్యారు.
నలుగురు స్నేహితుల బృందం
ఖాదర్కు తోడుగా కల్వకుర్తికి చెందిన ఇమ్రాన్, గౌస్, ఖాజా నిలిచారు. ఇమ్రాన్, గౌస్ హాజ్ వైరింగ్, ఖాజా జ్యూస్ తయారీతో ఉపాధి పొందుతున్న వీరు టీం లీడర్ అబ్దుల్ ఖాదర్తో కలిసి బృందంగా ఏర్పడ్డారు. కరోనా మృతదేహాలను శ్మశానాలకు తీసుకెళ్లి వారి ఆచార పద్ధతులకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. బాధితుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే చేరుకుంటారు. కుటుంబ సభ్యుల్లాగానే మసలుతూ మృతదేహాలను తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తున్నారు. ఖాధర్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఇప్పుడు షాకీర్, సోహైల్ జత కలిశారు.
ఆచార పద్ధతులను పాటిస్తూ..
ఖాదర్ బృందం ముస్లింలు అయినప్పటికీ అన్ని వర్గాల వారికి అండగా ఉంటూ అందరి ఆచార వ్యవహారాలను పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. పీపీఈ కిట్లు ధరించి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అంత్యక్రియలు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంతోపాటు నాగర్కర్నూల్, జడ్చర్ల నియోజకవర్గాలో ఇప్పటికీ 42 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.
ఏదీ ఆశించరు..
ఖాదర్కు కారు ఉంది. ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా.. ఖాదర్ బృందం కారులో వెళ్తారు. ఎవరి నుంచి ఏదీ ఆశించరు. బాధిత కుటుంబాలకు తమకు తోచినంత ఆర్థికసాయం అందిస్తారు. శుక్రవారం మాడ్గుల మండలంలో అంత్యక్రియలు చేసిన ఖాదర్ బృందం తమ వద్ద ఉన్న రూ.2500లను బాధిత కుటుంబానికి సహాయంగా అందజేశారు. ఇదే విషయమై ఖాదర్ బృందాన్ని అడిగితే.. దేవుడు మాకిచ్చిన దాంట్లో ఇతరులకు ఎంతో కొంత సహాయం చేస్తాం. బాధిత కటుంబాలకు అండగా ఉంటూ, వారి మత ఆచారాలకు అనునుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. బాధితుల కన్నీళ్లు తుడుస్తూ వారి కష్టాల్లో పాలుపంచుకుంటున్నామన్నారు.
మున్సిపల్ చైర్మన్ చేయూత
ఖాదర్ బృందానికి కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం చేయూత నందిస్తున్నారు. ఖాదర్ కారుకు డీజిల్ సమకూరుస్తూ పీపీఈ కిట్లు దాతల సహకారంతో ఇస్తున్నారు. తమ సహాయం కావాలని ఎవరు ఫోన్ చేసినా.. చేస్తున్న పని మధ్యలో వదిలేసి ఉన్న ఫళంగా వెళ్తున్న ఖాదర్ బాయ్ బృందాన్ని అభినందించని వారు లేరు. తమ సహాయం కావాలనుకునే వారు 9347250313 ఫోన్ చేయాలని, వెంటనే వస్తామని ఖాదర్ చెబుతున్నారు.
కన్నీళ్లు తుడవని జన్మ వ్యర్థం
సాటి మనిషి కన్నీళ్లు తుడవని జన్మ వ్యర్థం. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు చేయలేక బాధపడుతున్న వారికి చేయూత అందించాలనుకున్నాను. నేనొక్కడినే మూడు నాలుగు మృతదేహాలకు అంత్యక్రియలు చేశాను. విషయం తెలుసుకున్న నా స్నేహితులు ఒక్కొక్కరిగా చేతులు కలిపారు. గ్రూపుగా ఏర్పడ్డాం. మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం మా వాహనానికి డీజిల్ పోయిస్తున్నారు. పీపీఈ కిట్లు సమకూరుస్తున్నారు.
ఖాదర్ బాయ్ని చూసి..
ఖాదర్ బాయ్ని చూసి సేవ చేయాలని పించింది. కరోనాతో మరణించిన వారిని చూసి భయపడుతుంటే.. ఖాదర్ బాయ్ ధైర్యంగా పనిచేయడం గొప్పగా అనిపించింది. నేను నీతో వస్తానని అడిగాను. ఆయనతో కలిసి మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేసేందుకు వెళ్తున్నారు. భగవంతుడికి సేవ చేసినట్టేనని భావిస్తాను. – ఎండీ, ఇమ్రాన్, కల్వకుర్తి
గొప్పగా భావిస్తాను
కరోనాతో చనిపోయిన వ్యక్తిని ముట్టుకోవడానికి రక్త సంబంధీకులు వెనుకడుగు వేస్తే.. మేము తమ ఆత్మీయుడని భావిస్తున్నాం. తమ సొంత మనిషి చనిపోయాడని భావించి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తాం. వారి కుటుంబ పరిస్థితిని బట్టి సహాయం చేస్తున్నాం. మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుందని భావిస్తాం. – గౌస్, కల్వకుర్తి
సేవ చేయడంలోనే ఆనందం
నేను వృత్తి రీత్యా జ్యూస్ విక్రయిస్తాను. నా కుటుంబానికి అదే ఆధారం. కరోనాతో చనిపోయిన వారి బంధువుల బాధలు వర్ణనాతీతం. సహాయం చేసే వారు లేకపోవడంతో బాధ కలిగింది. ఏ మతమైన సాటి మనిషికి సేవ చేయాలనే చెబుతుంది. సేవ చేయడం ఆత్మ సంతృప్తినిస్తుంది. ఖాజా, కల్వకుర్తి