ఫర్టిలైజర్సిటీ, మే 4 : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పెద్దపల్లి జిల్లా గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకు చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చోరీకి పాల్పడిన ముఠాలోని ఒక సభ్యుడిని మంగళవారం అరెస్టు చేశారు. గత మార్చి 25న బ్యాంకులో 6 కిలోల బంగారం, రూ.18 లక్షలు దొంగిలించగా మంథని పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. చోరీకి పాల్పడింది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర గ్యాంగ్లేనని నిర్ధారణకు వచ్చారు. మూడు బృందాలను ఏర్పాటుచేసి మహారాష్ట్ర, యూపీకి పంపించారు. కాగా, మహారాష్ట్రలో జరిగిన బ్యాంకు దొంగతనాలకు సంబంధించి అక్కడి పోలీసులు అదే రాష్ర్టానికి చెందిన ముగ్గురిని పట్టుకున్నారు. వారిచ్చిన సమాచారంతో యూపీకి చెందిన ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. వారి నుంచి గుంజపడుగు ఎస్బీఐకి చెందిన కొన్ని బంగారు ఆభరణాలు స్వాధీన పర్చుకున్నారు. మహారాష్ట్ర పోలీసుల సమాచారంతో ముఠాలోని ఒక సభ్యుడైన ఆదేశ్శర్మను పట్టుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అతని దగ్గర నుంచి 20 తులాల బంగారం రికవరీ చేశారు. అనంతరం యూపీలోని లోకల్ మెజిస్ట్రేట్ ముందు నిందితుడిని చోరీ సొత్తును చూపించి ట్రాన్సిట్ వారెంట్పై ఆదేశ్శర్మను మంథని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం హాజరుపరిచారు.