తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లతో వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. భక్తుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ ఆన్లైన్లో టికెట్లు ఏర్పాటు చేస్తున్న చెన్నైకి చెందిన రేవతి ట్రావెల్స్ సంస్థపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. రేవతి ట్రావెల్స్ సంస్థ నిర్వాహకులు భక్తుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ ఆన్లైన్లో దర్శనం టికెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ నిర్వహించి పోలీసులు సదరు సంస్థపై కేసు నమోదు చేశారు. భక్తులు www.tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో తమ ఆధార్ కార్డ్ నంబర్, చిరునామాతో టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని టీటీడీ కల్పించింది. రూ 300 టికెట్లు, కల్యాణోత్సవ టికెట్లతోపాటు పలు ఆర్జిత సేవా రానున్న నెల కోటా టికెట్లను ప్రతి నెల 20న టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది.