అమరావతి : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ను వెంటనే రద్దు చేయాలని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయకుడు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని ఆయన ఆరోపించారు.
పూర్తిగా కేంద్ర బలగాలు, సిబ్బందితో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలోకి భారీగా బయటి వ్యక్తులు వచ్చారని ఆక్షేపించారు.
పోలీసులు సరిహద్దులు మూసివేసి వాహనాలను తనిఖీలు చేసి పంపించాలి. అందుకు భిన్నంగా చెక్పోస్టులను పోలీసులు ఎందుకు ఎత్తివేశారని ప్రశ్నించారు.
‘‘భాజపా నాయకురాలు శాంతారెడ్డి దొంగ ఓటర్లను పట్టుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వేల మంది వస్తే పోలీసులు ఏం చేస్తున్నారు. పోలీసులు, అధికారులు ప్రజాస్వామ్యం కోసం పని చేయాలి.
పోలీసులు, అధికారులు ఉన్నది జగన్ కోసం కాదు. తిరుపతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. బందిపోట్లను తలపించేలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ కన్వెన్షన్లో వేల మందిని ఉంచారు.
బయటి వ్యక్తులు తిరుపతిలో ఉంటే పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు. దొంగ ఓటర్లను పట్టుకున్న టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారు. పుంగనూరుకు చెందిన పెద్దిరెడ్డి తిరుపతిలో ఎందుకున్నారు.
మంత్రి పెద్దిరెడ్డిని తిరుపతిలో పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు. వందల మందిని తీసుకువచ్చి పర్యాటకులు అంటున్నారు. వందల మందిని రెడ్హ్యాండెడ్గా పోలీసులకు పట్టించాం. కేంద్రం పంపిన బలగాలు ఏమయ్యాయి.
వెబ్కాస్టింగ్ నిర్వహణ ఏమైంది. అక్రమాలపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. వైసీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యంపై నమ్మకం కలిగించే బాధ్యత ఈసీపై ఉందని అన్నారు. పోలీసులు, సిబ్బంది అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
వైసీపీ అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వైసీపీ అక్రమాలను బయటపెట్టిన టీడీపీ శ్రేణులను అభినందిస్తున్నానని అన్నారు.
అక్రమాలపై ఈసీకి అన్ని ఆధారాలు ఇస్తామని తెలిపారు. వైసీపీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈసీ కఠిన నిర్ణయం తీసుకొని ప్రజల్లో విశ్వాసం నెలకొల్పాలని చంద్రబాబు కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి