భరూచ్, మే 1: గుజరాత్లోని భరూచ్లో ఉన్న పటేల్ వెల్ఫేర్ హాస్పిటల్లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది చనిపోయారు. మృతుల్లో 16 మంది కొవిడ్ రోగులు. ఇద్దరు నర్సులు. ప్రమాదం జరిగిన సమయంలో దవాఖానలో దాదాపు 50 మంది చికిత్స పొందుతున్నారు. మంటల ధాటికి దవాఖానలో ఐసీయూ యూనిట్ పూర్తిగా దగ్ధమైంది. ఐసీయూలో చికిత్స పొందుతున్నవారి మృతుదేహాలు గుర్తుపట్టరానంత కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ ఈ అగ్ని ప్రమాదానికి కారణం కావొచ్చని అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ, కేంద్రహోం మంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల పట్ల సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ప్రమాదంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహిస్తామని విజయ్ రూపానీ తెలిపారు.