తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం రాత్రి 7 గంటలకు ఆలయంలో బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు.
ధ్వజారోహణం రోజున గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగంనపే కార్యక్రమమే ధ్వజావరోహణం. తిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా గరుడాళ్వార్ దేవతలను కోరతాడు. ఈ సందర్భంగా గరుడ ధ్యానం, భేరిపూజ, భేరితాడనం, గరుడగద్యం, దిక్పాలక గద్యం, గరుడ లగ్నాష్టకం, గరుడ చూర్ణిక అనే ఏడు మంత్రాలను అర్చకులు జపిస్తారు. ధ్వజావరోహణ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, టీటీడీ ఈవో జవహర్రెడ్డి దంపతులు పాల్గొన్నారు.