దామరచర్ల, ఏప్రిల్ 26 : ఒక్క ఫోన్ కాల్ చేయగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంలో గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించడంతో పాటు దవాఖానకు చేరవేస్తున్న 108 వాహనం నేడు కరోనా రోగులకు కూడా సేవలు అందిస్తున్నది. ఎవరికైనా కరోనా వచ్చిందంటే చాలు ఆమడ దూరం పరిగెత్తే ప్రస్తుత పరిస్థితుల్లో 108 సిబ్బంది మాత్రం ఎలాంటి భయం, ఆందోళన లేకుండా వారి వద్దకు వెళ్లి సేవలు అందిస్తున్నారు. మండలానికి కేటాయించిన 108 వాహనం అన్ని రకాల వ్యాధిగ్రస్తులకు సంజీవనిగా మారింది.
ఆరుగురు సిబ్బంది
మండల కేంద్రంలో 108 వాహనంలో ఆరుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో ముగ్గురు పైలట్లు, మరో ముగ్గురు ఈఎమ్టీలుగా విధులు నిర్వహిస్తున్నారు. దామరచర్ల పీహెచ్సీకి కేటాయించిన ఈ వాహనం దామరచర్లతో పాటుగా అడవిదేవులపల్లి, సూర్యాపేట జిల్లాలోని పలు గ్రామాలకు సైతం వెళ్లి బాధితులను దవాఖానకు తరలిస్తున్నారు. ఈ వాహనం ప్రమాదాల్లో గాయపడిన వారికి సేవ చేయడంతో పాటు గర్భిణులు, ఇతర రకాల రోగులకు కూడా సేవలు అందిస్తున్నది.
కరోనా బాధితులకు సేవలు
ఇటీవల కరోనా కేసులు పెరగడంతో 108 వాహనాల ద్వారా వారికి దవాఖానలకు తరలిస్తున్నారు. మండల కేంద్రంలో ఇటీవల కరోనా బారిన పడిన రోగులను మిర్యాలగూడ, నల్లగొండ, హైదరాబాద్కు కూడా తరలించి వారి ప్రాణాలు కాపాడారు. గతేడాది కూడా 172 మంది కరోనా రోగులను వివిధ దవాఖానలకు తరలించారు. ప్రస్తుతం కూడా కరోనా రోగుల సేవల్లో ఉన్నారు.