శ్రీనగర్: ఓ నాలుగేండ్ల చిన్నారి ఆదా షకీల్ గురువారం సాయంత్రం వరకు ఇంటి పరిసరాల్లోనే ఆడుతూ కనిపించింది. కానీ ఆ తర్వాత కనిపించకుండా పోయింది. దాంతో కంగారుపడ్డ బాలిక తల్లిదండ్రులు రాత్రి వరకు వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. శుక్రవారం ఉదయం మళ్లీ అంతటా గాలించగా ఇంటికి సమీపంలోని అటవీ ప్రాంతంలో శవమై కనిపించింది. జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని బుద్గామ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అటవీ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. బాలిక మృతదేహంపై ఉన్న గాయాలను పరిశీలించి చిరుతపులి దాడిలో ఆ చిన్నారి చనిపోయినట్లు నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అటవీ సిబ్బంది చిరుతపులి జాడ కోసం గాలింపు చేపట్టారు. కాగా, తమకు చిరుతపులుల బెడద లేకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు అటవీ అధికారులను కోరారు.