హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): బీసీల గణనపై బీసీ కమిషన్ ఇచ్చిన నివేదికను కోర్టుకు అందించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతోపాటే రెండు రోజుల్లోగా సంక్షిప్తంగా అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీచేసింది. బీసీ రిజర్వేషన్లను తగ్గించడాన్ని సవాల్చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అదనపు ఏజీ రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లకు సంబంధించి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చిన రిపోర్టును పరిగణనలోకి తీసుకోలేదని, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించినట్టు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గరిష్ఠంగా 50 శాతం మించకుండా రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టం చేసినట్టు పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం రెండు రోజుల్లో పూర్తి అఫిడవిట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.