తిరుపతి,మే 6: కోవిడ్ వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా, భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఉప ఆలయాల దర్శన వేళల్లో టిటిడి మార్పులు చేపట్టింది. ఆలయాల్లోని సేవలన్నీ ఏకాంతంగా నిర్వహిస్తారు. సాయంత్రం బ్రేక్ దర్శనాన్ని టిటిడి రద్దు చేసింది.
ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 6.30 గంటల వరకు సుప్రభాతం, 6.30 నుంచి 8.30 గంటల వరకు సహస్రనామార్చన, నిత్యార్చన, శుద్ధి, మొదటి గంట, ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు సర్వదర్శనం, ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కల్యాణోత్సవం, ఉదయం 11.30 నుంచి12 గంటల వరకు బ్రేక్ దర్శనం, మధ్యాహ్నం12 నుంచి12.30 గంటల వరకు శుద్ధి, రెండో గంట తరువాత మధ్యాహ్నం12.45 గంటలకు ఆలయం తలుపులు మూసివేస్తారు.
ఆ తరువాత సాయంత్రం 4 గంటలకు ఆలయ తలుపులు తెరిచి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ముఖ మండపంలో ఊంజల్ సేవ నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు శుద్ధి, రాత్రి గంట తరువాత రాత్రి 7.15 గంటలకు ఏకాంత సేవ చేపట్టి ఆలయం తలుపులు మూసివేస్తారు.