హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరానికి మణిహారంలా ఉన్న మెట్రో రెండోదశకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఉన్న 69 కిలోమీటర్లకు తోడు మరో 80 కిలోమీటర్ల మేర మెట్రోకారిడార్ నిర్మించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. అత్యంత కీలకమైన ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల మార్గానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఇందుకోసం హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)ని ఏర్పాటుచేశారు. ఇందులో హైదరాబాద్ మెట్రో రైలుతోపాటు హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ, జీఎంఆర్ ఎయిర్పోర్టుతో కలిసి ఎయిర్పోర్టు మెట్రో కారిడార్ను నిర్మించాలని నిర్ణయించారు. ఈ కారిడార్ నిర్మాణం కోసం ఢిల్లీ మెట్రోరైలు సంస్థతో డీపీఆర్ను సైతం సిద్ధంచేశారు. శంషాబాద్ మెట్రో కారిడార్కు భూసేకరణ అవసరం లేకపోగా.. సుమారు 4 వేల కోట్లు వెచ్చిస్తే సరిపోతుందని అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించింది. హెచ్ఎండీఏతోపాటు టీఎస్ఐఐసీ, జీఎంఆర్ ఎయిర్పోర్టు సైతం కొంత మొత్తాన్ని వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీనికితోడు బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడం ద్వారా రెండేండ్లలోనే ఈ ప్రాజెక్టు పూర్తికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.