తిరుమల, 21మే : తిరుమల శ్రీవారి ఆలయంలోని కల్యాణమండపంలో జరుగుతున్న శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు శుక్రవారం రెండో రోజుకు చేరాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. శ్రీవారి ఆలయంలోనికల్యాణమండపంలో మధ్యాహ్నం 4 గంటలకు ఈ ఉత్సవ కార్యక్రమం ప్రారంభమైంది.
పరిణయోత్సవంలో రెండవ రోజైన శుక్రవారంనాడు వైశాఖశుద్ధ దశమి. ఇదే అసలు అలనాటి ముహూర్తదినమని పురాణాల ద్వారా తెలుస్తోంది. కనుక ఈ మూడు రోజుల పద్మావతీ పరిణయోత్సవంలో రెండవ రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఈ సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి వేంచేపు చేయగా, వెంట స్వర్ణ పల్లకీలో శ్రీదేవి , భూదేవి అనుసరించారు. మొదటిరోజు మాదిరే శ్రీస్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలమాలలు మార్చడం, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తరువాత కొలువు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు డిపి.అనంత, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకస్వాములు పాల్గొన్నారు.