తిరుమల,జూన్ 15: కరోనావ్యాప్తి నేపథ్యంలో జూన్ 19 నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా జరుగనున్నాయి. ఇందుకోసం జూన్ 18వ తేదీ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. జూన్ 19న ఉదయం 10.45 నుంచి 11.15 గంటల మధ్య సింహ లగ్నంలో ధ్వజారోహణం జరుగనున్నది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో తిరుచ్చి ఉత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు.
జూన్ 22న సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం ఏకాంతంగా నిర్వహిస్తారు. జూన్ 27న ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమెత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్కు స్నపన తిరుమంజనం జరుగనుంది. అనంతరం ఉదయం 10 నుంచి 10.15 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా గంగాళంలో చక్రస్నానం చేపడతారు. రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించనున్నారు.