కార్పొరేషన్, జూన్ 25: కరీంనగర్ ప్రజలకు సీఎం కేసీఆర్ సహకారంతో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. పార్కు ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, గతంలో నిధుల కొరతతో పట్టణాలు అస్తవ్యస్తంగా ఉండేవని, కానీ తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రతి నెలా కేటాయిస్తున్న నిధులతో ప్రగతి బాట పట్టాయని గుర్తుచేశారు. గతంలో పార్కు స్థలాలన్నీ కబ్జాకు గురయ్యే పరిస్థితి ఉండేదని, సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉద్యానవనాల స్థలాలను కాపాడడంతోపాటు వాటిని పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం అస్యూరెన్స్ నిధులతో పాటు పట్టణ ప్రగతి నిధులతో నగర రూపురేఖలు మారుతున్నాయన్నారు. రూ.4 కోట్ల నిధులతో నగరంలోని 14 పార్కులను సుందరీకరించామని తెలిపారు.
ఇప్పటికే కొన్ని పార్కులను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగా మరికొన్ని అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు. కొన్ని పార్కు స్థలాలు కోర్టు వివాదాల్లో ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే పరిష్కరించి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. నగరపాలక సంస్థకు చెందిన స్థలాలు ఏవీ కూడా అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ఐటీ టవర్ పూర్తి చేయగా, ప్రస్తుతం కేబుల్ బ్రిడ్జి నిర్మాణం వేగంగా సాగుతున్నదని పేర్కొన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ను రూ.413 కోట్లతో చేపడుతున్నామని, దీనిని థీమ్ పార్కులు, మ్యూజికల్ ఫౌంటేన్స్, అందమైన గ్రీనరీతో తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీ హరిశంకర్, కమిషనర్ క్రాంతి, కార్పొరేటర్ ఐలేందర్యాదవ్, స్థానిక ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.