అమరావతి : మాతృభాష.. జాతి ఔన్నత్యానికి ప్రతీక అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. మధురమైన తెలుగు భాషను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. తెలుగువాడు భాషాభిమాని తప్ప దురభిమాని కాదని పేర్కొన్నారు. తిరుపతిలో ఇవాళ అంతర్జాల వేదిక ద్వారా అవధాని మేడసాని మోహన్ ఆధ్వర్యంలో చతుర్గుణిత అష్టావధానం నిర్వహించారు. తొలి ప్రశ్న వేసి అష్టావధానాన్ని సీజేఐ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాషకు ఆదరణ తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సాహితీ ప్రక్రియను జనరంజకంగా తీర్చిదిద్దాలని అన్నారు. సాహిత్య రూపం కనుమరుగైతే తిరిగి సృష్టించలేమని పేర్కొన్నారు. సాహితీ ప్రక్రియను ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా మార్పు చేసుకోవాలని సీజేఐ అభిప్రాయపడ్డారు. సాహితీ సేవలో తనవంతు కృషి చేయడానికి ముందుంటానని అన్నారు. అవధాన ప్రక్రియ తెలుగు భాషకు ప్రత్యేకమని, శతాబ్దాల సాహితీ తపస్సు నుంచి అవధానం ఉద్భవించిందని ఎన్వీ రమణ తెలిపారు. జ్ఞాపకశక్తి, అపార మేధస్సు, భాష మీద పట్టు మేళవింపే అవధానమని వెల్లడించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం జీవన గమనాన్ని మారుస్తున్నదన్నారు.